విశ్వనగరి సిగలో ‘‘జలహారం’’ (YEAR ROUND UP 2019)
- నూతన ఆవిష్కరణలకు జాతీయస్థాయి ప్రశంసలు
- ఈ ఏడాదిలోనే జలమండలి పరిధి ఓఆర్ఆర్ వరకు పొడిగింపు
- మాస్టర్ సెవరెజీ ప్లాన్ డీపీఆర్ పూర్తి
- నాణ్యమైన నీటి సరఫరాలో బీఐఎస్ సర్వేలో రెండో స్థానం
- నీటి సంరక్షణకు నీటి సంరక్షణ- జల నాయకత్వం
జలమండలి దశాబ్దాల కాలంగా అందిస్తున్న సేవలకు గుర్తింపు... గడిచిన ఏడాది కాలంలో ఎన్నో అవార్డులు అందుకున్న జలమండలి. తను అందిస్తున్న సేవలకు జాతీయస్థాయి ప్రశంసలు అందుకుంది. ఒకప్పుడు నిధుల కేటాయింపులో నిరాదరణకు గురయిన జలమండలి. ప్రత్యేక రాష్ట్రంలో ఆత్మగౌరవంతో నిలుస్తుంది. విశ్వనగరిగా రూపాంతర చెందుతున్న భాగ్యనగరి సిగలో జలమండలి ఓ మణిహారాన్ని తలపిస్తుంది. గతంలో ప్రధాన నగరవాసులకు వారానికి ఒకరోజు మంచినీటిని సరఫరా చేసేందుకు ఇబ్బందిపడ్డ బోర్డు .. నేడు ప్రధాన నగరంతో పాటు ఓఆర్ఆర్ వరకు గల గ్రామాల్లోని ప్రతి ఇంటికి రోజు మార్చి రోజు మంచినీటిని సరఫరా చేసే స్థాయికి ఎదిగింది. సింగూరు, మంజీరా, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లకు కృష్ణా 3ఫేజులు, గోదావరి ఒక ఫేజుతో ప్రతి రోజు 468 ఎంఎల్డీల నీటిని తీసుకువచ్చి సరఫరా చేస్తున్నాము. రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురిసి జలాశయాలు నిండుకుండను తలపిస్తుండడంతో.. రానున్న వేసవిలో సైతం విశ్వనగరికి నీటి ఇబ్బందులు తలెత్తవు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొండ పోచమ్మ రిజర్వాయర్ నుంచి ఇన్ టెక్ పైపులైనులు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే ఇక ఓఆర్ఆర్ పరిధి వరకు ఏకాలంలోనైనా మంచినీటికి ఢోకా ఉండదు.
బోర్డు చేపట్టే ప్రతి కార్యక్రమం రాష్ట్రానికి, దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. మానవ రహిత పారిశుద్ద్య కార్యక్రమాలకు కంకణం కట్టుకున్న జలమండలి. మినీ జెట్టింగ్ యంత్రాలతో ఈ మానవ రహిత పారిశుద్ద్య పనులను చేపట్టి.. దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. పారిశుద్ద్య కార్మికులకే ఈ యంత్రాలను ఇప్పించి వారు ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు భరోసా కల్పించింది. జలమండలి చేపడుతున్న కార్యక్రమాలు ఇతర మెట్రోనగరాల దృష్టిని సైతం తన వైపు తిప్పుకుంటుంది. జలమండలి రూపొందించిన మినీ ఎయిర్ టెక్ యంత్రాలనే ఢిల్లీ, బెంగుళూరు వంటి నగరాల్లో వినియోగిస్తున్నారు.
నగరంలో జలమండలి ప్రతిరోజు సరఫరా చేస్తున్న నీటిలో దాదాపుగా 40 శాతం నీరు పలు కారణాల వల్ల వృథాటగా పోతుంది. వీటిని తగ్గించేందుకు జలమండలి వాక్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ వాక్ కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తుంది. 40శాతం నుంచి ఎన్ఆర్ డబ్య్లూ 38 శాతానికి తగ్గింది. దీన్ని 35శాతంకు తగ్గించేందుకు తీవ్ర కసరత్తు చేస్తుంది.
జలమండలి సరఫరా చేస్తున్న మంచినీరు కలుషితమైనవి అనే అపోహాలను పటాపంచలు చేస్తూ జలమండలి ఐఎస్ఓ సర్టిపికేట్ పొందింది. నాణ్యత విషయంలో అధిక ప్రాధాన్యత ఇచ్చే వారికి ఐఎస్ఓ ధృవీకరణ లభిస్తుంది. అందుకే మంచినీటి సరఫరా విషయంలో జలమండలి నాణ్యత విషయంలో రాజీపడట్లేదు కాబట్టే ఈ దృవీకరణ సొంతం చేసుంకుంది. జలమండలి మొత్తం మూడు విభాగాల్లో ఐఎస్ఓ గుర్తింపు లభించింది. వినియోగదారులకు సంతృప్తి మేర సేవలు అందిస్తున్నందుకు గాను అలాగే జలమండలి ట్రాన్స్ మిషన్ వ్యవస్థకు, జలమండలి మంచినీటి సరఫరా వ్యవస్థకు సైతం లబించింది.
హైదరాబాద్ లో జలమండలి సరఫరా చేస్తున్న నీరు చాలా సురక్షితమని కేంద్ర ప్రభుత్వం సైతం కితాబిచ్చింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్)వారు దేశ వ్యాప్తంగా ఉన్న 21 ప్రధాన నగరాల నుంచి 10 చొప్పున శాంపిల్స్ స్వీకరించి 28 ప్రమాణాల పరీక్షలు నిర్వహించారు. ఇందులో జలమండలి నుంచి స్వీకరించిన పదింటిలో 9 శాంపిల్స్ నాణ్యత ప్రమాణాలకు లోబడి ఉన్నాయని కేంద్ర మంత్రి పాశ్వాన్ వెల్లడించారు. దీంతో ముంబై మొదటి స్థానంలో నిలువగా... హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది.
ఔటర్ రింగ్ రోడ్డు వరకు పారిశుద్ద్య పనులు చేపట్టడానికి ఎస్టీపీ నిర్మాణానికి డీపీఆర్ లు సిద్దంచేస్తుంది. పారిశుద్ద్య పనులను మరింత సులభతరం చేసేందుకు రోబోటిక్ యంత్రాలను ప్రోత్సహించే దిశగా బోర్డు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వీటికి తోడు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న గ్రామాలకు ఇంటింటికి మంచినీటిని సరఫరా చేసేందుకు రూ. 746 కోట్లతో మొదలుపెట్టిన ఓఆర్ఆర్ ప్రాజెక్టు ఈ ఏడాదే పూర్తయి స్థానికులకు మంచినీటిని అందిస్తుంది.
జలమండలి అందుకున్న అవార్డులు, ప్రశంసలు
- హాడ్కో సంస్థ 49వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నూతన ఆవిష్కరణలతో హైదరాబాద్ నగరంలో నివాసయోగ్యమైన సౌకర్యాలు కల్పిస్తున్నందుకు గాను హాడ్కో అవార్డును జలమండలి ఆపరేషన్స్ డైరెక్టర్ శ్రీ. అజ్మీరా కృష్ణ గారు తేది.25.04..2019, గురువారం రోజున న్యూఢిల్లీలో కేంద్ర హాబిటేట్ సెంటర్ అధ్యక్షులు శ్రీ. జి. పార్థసారధి గారి చేతుల మీదుగా అందుకున్నారు.
- తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కౌన్సిల్ 7వ సమ్మిట్ లోభాగంగా తేది. 01.06.2019, శనివారం రోజున ఐటీ కారిడార్లో నగరవాసులకు అత్యత్తమ సేవలు అందించినందుకు గాను జలమండలి ఈ అవార్డు దక్కింది.
- జలమండలి సేవలకు ఐఎస్ఓ సర్టిపికేట్ లభించింది. ఇప్పటీకే మంచినీటి సరఫరాలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ శుద్ద మంచినీటిని నగర ప్రజలకు అందిస్తున్నందుకు ఇప్పటీకి కేవలం ట్రాన్స్మిషన్ వ్యవస్థకు మాత్రమే ఐఎస్ఓ సర్టిఫికేట్ పొందిన జలమండలి నేడు పంపిణీ వ్యవస్థకు కూడా సర్టిఫికేట్ ను పొందింది. వినియోగదారులకు సంతృప్తికర సేవలు అందిస్తున్నందుకు గాను ఇంతకుముందే మరో ఐఎస్ఓ సర్టిఫికేట్ లభించింది.
- కేంద్ర హౌసింగ్ మరియు అర్బన్ ఎఫైర్స్ మంత్రిత్వ శాఖ మరియు సోషల్ జస్టిస్, ఎంపవర్ మెంట్ శాఖల ఆద్వర్యంలో తేది. 19.08.2019, సోమవారం రోజున న్యూఢిల్లీలో స్థిరమైన పారిశుద్ద్యం అనే అంశంపై జాతీయ సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కార్యదర్శి శ్రీ దుర్గా శంకర్ ముష్రా గారు జలమండలి ఎండీ శ్రీ. ఎం. దానకిషోర్, ఐఏఎస్ గారిని ప్రశసించారు.
- హైదరాబాద్ మహానగరంలో నీటిని పొదుపు చేయడానికి జలమండలి 2016 నుంచి ఇప్పటీ వరకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు జలమండలి ఎండీ శ్రీ. ఎం.దానకిషోర్, ఐఏఎస్ గారు తెలిపారు. తేది. 26.08.2019, సోమవారం రోజున న్యూడిల్లీ, చాణక్యపురి హోటలర్ అశోకలో నిర్వహించిన జలశక్తి అభియాన్ సమీక్ష మరియు కార్యశాలలో పాల్గొన్నారు.
- టీఎస్ ఐపాస్ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా మాదాపూర్ శిల్పకళా వేదికలో నిర్వహించిన వేడుకల్లో జలమండలికి టీఎస్ ఐపాస్ ప్రధానం చేసిన అవార్డుల్లో మూడవ కేటగిరీలో ప్రధమ స్ధానం లభించింది. ఈ అవార్డును తేది. 04.12.2019, బుధవారం రోజున రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ. కె. తారక రామారావు గారు, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి గారి చేతుల మీదుగా జలమండలి ఎండీ శ్రీ.ఎం. దానకిషోర్, ఐఏఎస్ గారు ఈ అవార్డును అందుకున్నారు.
- విద్యుత్ పొదుపుకు తీసుకుంటున్న చర్యలకు గాను తెలంగాణ రాష్ట్ర ఇందన పునరుద్దరణీయ ఇంధన వనరుల అభివృద్ది సంస్థ వారు అందజేస్తున్న తెలంగాణ రాష్ట్ర ఇందన పొదుపు అవార్డు-2019 జలమండలికి దక్కింది. స్థానిక సంస్థలు, సెవరెజీ బోర్డుల విభాగంలో జలమండలికి సిల్వర్ అవార్డు లభించింది. ఈ అవార్డును రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళ్ సై సౌందరరాజన్ గారు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీష్ రెడ్డిల చేతుల మీదుగా తేది. 20.12.2019, శుక్రవారం రోజున ప్రధానం చేశారు.
- ఇంటర్ నేషనల్ వాటర్ అసోసియేషన్ (ఐడబ్ల్యుఎ) ప్రతిష్టాత్మక ఐడబ్యూఏ డెవలప్ మెంట్ అవార్డుకు భారతదేశం నుంచి హైదరాబాద్ జలమండలి ఎండీ శ్రీ. ఎం. దానకిషోర్, ఐఏఎస్ గారిని ఎంపిక చేసింది. జల నాయకత్వం మరియు జల సంరక్షణ (WaLC) కార్యక్రమం ద్వారా నీటి వథాను తగ్గించడం, పునర్వినియోగం, బోర్లు రీఛార్జ్ చేయడంపై దృష్టి సారించిన ఒక ప్రత్యేకమైన చొరవ మరియు నీటి సంరక్షణ అంశంపై ప్రజలలో అవగాహాన కల్పిస్తున్న విషయాలను ఈ అవార్డు నామినేషన్స్ కోసం పంపడం జరిగింది.
వాక్ కార్యక్రమం
నగరంలో వృథాగా పోతున్న మంచినీటిని పొదుపు చేసేందుకు జలమండలి నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జల నాయకత్వం - నీటి సంరక్షణ (వాక్ ) కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ లోని 150 వార్డుల్లో వార్డుకు కనీసం వంద మంది వాలంటీర్స్ చొప్పున ఆరు జోనల్ కమీషనర్స్ పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాలలో జోనల్ కమీషనర్, జలమండలి డైరెక్టర్స్, స్థానిక రెసిడెన్షియల్ వెల్ఫెర్ అసోసియేషన్ సభ్యులు, స్వచ్చంద సంస్థలు , విద్యాసంస్థలతో కలిపి నగర ప్రజల్లో నీటి వృథాను ఆరికట్టడం కోసం, నీటి పొదుపుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించే విధంగా సమాజానికి ఉపయోగపడే ఒక మంచి కార్యక్రమం కోసం స్వచ్చందంగా పనిచేయడం కోసం ముందుకు వచ్చే వాలంటీర్స్ ద్వారా ప్రజల్లో అవగాహన కలిగించాలని జలమండలి ప్రతిపాదించింది. జలమండలి సరఫర చేస్తున్న నీటిలో దాదాపుగా 35శాతం నీరు వినియోగదారుల ఇళ్ల వద్ద వృథాగా పోతున్నాయి. వాటిని తగ్గించిడం కోసం వాక్ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. నీటి పొదుపుపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జలశక్తి అభియాన్ కంటే ముందుగా నే జలమండలి నీటి సంరక్షణ పై వాక్ కార్యక్రమాన్ని చేపట్టింది. వాక్ లో భాగంగా జలమండలి చేపడుతున్న కార్యక్రమాలను కేంద్ర జలశక్తి అభియాన్ అధికారులు నగరానికి వచ్చి పరిశీలించి వెళ్లారు.
ఇందులో భాగంగా ప్రతి ఇంటిక వెళ్లే జలమండలి అధికారులు, వాక్ వాలంటీర్లు ప్రతి ఇంటిలో నీటి పొదుపు చర్యలు చేపడుతున్నారా... అనే విషయాలను పరిశీలించి ఆ ఇంటికి ఎరుపు, ఆకుపచ్చ రంగుల గుర్తులు కేటాయింపు చేశారు. ప్రతి నెలకు ఒక సారి తిరిగి పరిశీలించి అవగాహాన కల్పించి.. ఎరుపు రంగు గుర్తు కలిగిన ఇళ్లను ఆకుపచ్చ రంగు వచ్చే విధంగా ఆ ఇంటి నివాసులు నీటి సంరక్షణ చర్యలు చేపట్టే విధంగా అవగాహాన కల్పిస్తారు. ఆకుపచ్చ రంగు గుర్తులు అధికంగి వస్తే నగరంలో ప్రజలు ఆ ఇంటిలో నీటి సంరక్షణ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది
జలమండలిని సందర్శించిన పలు సంస్ధల ప్రతినిధులు
- జాతీయ నదుల పరిరక్షణ డైరెక్టరేట్ (ఎన్ఆర్సీడీ) అడిషనల్ డైరెక్టర్ శ్రీ. లలిత్ బాకోలియా గారు తేది. 20.02.2019, బుధవారం రోజున ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు.
- ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు ప్రతినిధులతో జలమండలి ఎండీ శ్రీ. ఎం.దానకిషోర్, ఐఏఎస్ గారు తేది. 27.02.2019, బుధవారం రోజున సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎండీ ఇప్పటీకే జలమండలి విజయవంతంగా పూర్తిచేసిన ప్రాజెక్టుల గురించి వివరించారు. అలాగే రానున్న రోజుల్లో జలమమండలి చేపట్టబోయే రేడియల్ రింగ్ మెయిన్, ఓఆర్ఆర్ రింగ్ మెయిన్, జోన్-3 మాస్టర్ సెవరెజీ ప్లాన్, 24 గంటల మంచినీటి సరఫరా ప్రాజెక్టులకు నిధులు సమకూర్చాలని కోరారు.
- నీటిపొదుపు, ఇంకుడుగుంతల నిర్మాణం ప్రాముఖ్యతను తెలియజేసేందుకు జలమండలి నిర్మించిన రెయిన వాటర్ హార్వేస్టింగ్ పార్కును తేది. 18.09.2019, బుధవారం రోజున చెన్నె జలమండలి అధికారులు సందర్శించారు.
- జలమండలి చేపడుతున్న కార్యక్రమాలు, నూతన ఆవిష్కరణలు చాలా అద్భుతంగా ఉన్నాయని జాతీయ సఫాయి కర్మాచారి కమీషన్ సభ్యుడు శ్రీ. జగదీష్ హిరేమని గారు తెలిపారు. తేది. 19.09.2019, గురువారం రోజున ఖైరతాబాద్ లోని జలమండలి ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు.
- జలమండలి చేపడుతున్న మానవ రహిత పారిశుద్ద్య పనులను జాతీయ సఫాయి కర్మచారి కమఅషన్ చైర్మన్ మన్హర్ వాల్జిభాయి జాలా, సభ్యుడు జగదీష్ హిరేమణి గారు జలమండలి ఎండీ ఎం. దానకిషోర్, ఐఏఎస్ గారితో కలిసి తేది. 16.10.2019, బుధవారం రోజున ఖైరతాబాద్ లో క్షేత్రస్థాయిలో పర్యటించారు.
- జలమండలి ఎండీ ఎం. దానకిషోర్, ఐఏఎస్ గారిని వాటర్ ఎయిడ్ సంస్ధ ప్రతినిధులు తేది. 25.10.2019, శుక్రవారం రోజున ఖైరతాబాద్ లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో కలిశారు. జలమండలి అధికారుల సహాకారంతో ఈ సంస్థ ప్రతినిధులు వారి సొంత డబ్బులు రూ. 40లక్షలతో అవగాహన కార్యక్రమాలు చేపడుతారు.
సివిల్ సర్వీస్ కు ఎంపికైన జలమండలి ఇంజనీర్
జలమండలిలో మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న బి. సుధీర్ కుమార్ సివిల్ సర్వీస్ కు ఎంపికయ్యారు.
నీటి సంరక్షణపై అవగాహాన కార్యక్రమాలు
- రాబోయే తరాలకు నీటి ఇక్కట్లు లేకుండడా ఉండాలంటే నేటి నుంచే నీటిని పొదుపుగా వాడాలని, నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని జలమండలి ఎండీ శ్రీ. ఎం. దానకిషోర్, ఐఏఎస్ గారు తెలిపారు. తేది. 03.03.2019, ఆదివారం రోజున జలమండలి, వాటర్ ఎయిడ్ ఇండియా సంయుక్తంగా నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా నుంచి ద బ్లూ మైల్ పేరుతో నిర్వహించిన 10 కె రన్లో ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.
- మంచినీటి విలువను నగర వాసులకు వివరించేందుకు ఈనెల 22న ఎర్త్ డేను పుస్కరించుకుని ఎన్టీఆర్ గార్డెన్ వద్ద వాటర్ బోర్డు అధికారులు, ఉద్యోగులు,వాలంటీర్లు, ఎన్జీవోల ప్రతినిధులు,వాక్ కమిటీల సభ్యులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది.
- ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న సెప్టిక్ ట్యాంకర్ల ఆపరేటర్లకు లైసెన్సులను జలమండలి ఎండీ శ్రీ. ఎం.దానకిషోర్, ఐఏఎస్ గారు తేది. 12.01.2019, శనివారం రోజున ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో అందజేశారు.
పూర్తయిన ఓఆర్ఆర్ ప్రాజెక్టు
రూ.756 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు లోపలి 183 గ్రామాలు, 7మున్సిపాలిటీలకు మంచినీటిని అందించేందుకు చేపట్టిన ఓఆర్ఆర్ ప్రాజెక్టు పనులు పూర్తయి స్థానికులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా 162 రిజర్వాయర్లు, 2వేల కిలో మీటర్ల పపైపులైను విస్తరణపనులు చేపట్టాము.
ఇబ్రహీంపట్నం, సరూర్ నగర్, షామీర్ పేట్, కీసర, కుత్బుల్లాపూర్, ఘట్ కేసర్, రాజేంద్రనగర్, హాయత్ నగర్, మహేశ్వరం, ఆర్ సీ పురం, పటాన్ చెరు మండలాల్లోని 183 గ్రామాలు, 7 మున్సిపాలిటీల్లోని ఇంటింటికి మంచినీటిని అందించేందుకు ఈ ప్రాజెక్టు ఎంతో గానో దోహాదపడుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తయిన తరువాత ప్రతి మనిషికి రోజుకు 125 లీటర్ల నీటిని సరఫరా చేయడం జరుగుతుంది. అలాగే రోజు విడిచి రోజు మంచినీటి సరఫరా జరుగుతుంది
రెవెన్యూ పెంపుపై కసరత్తు
బోర్డు ఆదాయం పెంచేందుకు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన జలమండలి... అక్రమంగా నల్లా కనెక్షన్లు తీసుకున్న వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం, జరిమానాలు విధించడం జరుగుతుంది. అలాగే కేటగిరీ విషయంలో ఇంటింటి సర్వే పేరుతో ఆరు డివిజన్లలో తనిఖీలు చేపడుతుంది. అలాగే అక్రమ నల్లా కనెక్షన్లు కలిగి ఉన్న వారికి ఒక అవకాశం ఇవ్వడానికి విడిఎస్ -2019 పథవకాన్ని ప్రవేశపెట్టింది. వీటితో పాటు మెరుగైన ఆదాయం కోసం డొమెస్టిక్ కనెక్షన్ల కంటే వాణిజ్య కనెక్షన్లకు బిల్లింగ్ లో ప్రాధాన్యత ఇవ్వడం. లెక్కలోకి రాకుండా పోతున్న నీటిని బిల్లింగ్ గా మార్చడం. మంచి ఆదాయం రాబట్టేందుకు మీటర్ల పనితీరు మెరుగుపర్చడం. మంచినీటి సరఫరా సామర్ధ్యానికి ఖచ్చితమైన బిల్లులు జారీచేసేలా మీటర్ రీడర్లకు అవగాహాన వంటివి జలమండలి చేపట్టింది.
ఇప్పటీ వరకు జలమండలి విజిలెన్స్ బృందాలు నగరవ్యాప్తంగా దాడులు నిర్వహించి అక్రమ నల్లా కనెక్షన్లను గుర్తించి సంబంధిత భవన యాజమానులపై 197 క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగింది. అలాగే వీటి ద్వారా రూ. 3 కోట్ల ఆదాయం బోర్డుకు సమకూరింది. అలాగే అక్రమంగా బిగించిన 584 నల్లా మోటార్లను సీజ్ చేయడం జరిగింది. 4728 అక్రమ నల్లా కనెక్షన్లను రెగ్యూలర్ చేయడం జరిగింది. వీటితో పాటు 3071 కనెక్షన్లను డొమెస్టిక్ నుంచి కమర్షియల్ గా కేటగీరి మార్పు చేయడం జరిగింది.
ఇంటింటి సర్వేలో భాగంగా డివిజన్ నెం. 5,6,7, 9,10,15 డివిజన్లలో ఇంటింటి తనిఖీలు చేపట్టిన సర్వే బృందాలు ఇప్పటీ వరకు 84094 కనెక్షన్లను తనిఖీ చేయగా... 4298 వాణిజ్య కనెక్షన్లు, 1494 అక్రమ నల్లా కనెక్షన్లు, 1358అదనఫు ఫ్లాట్ల గుర్తింపు ,సెవరెజీ కనెక్షన్లకు క్యాన్ నెంబర్ల కేటాయింపు2689 భవనాలను గుర్తించారు. వీటి ద్వారా రూ. 11.31 కోట్ల ఆదాయం సమకూరింది. అలాగే ఈ కనెక్షన్ల ద్వారా ప్రతినెల దాదాపుగా రూ.27.43 లక్షల అదనపు ఆదాయం సమకూరనుంది.
విడిఎస్ -2019ప్రారంభం
అక్రమంగా పొందిన నల్లా కనెక్షన్లను క్రమబద్దీకరించడానికి విడిఎస్- (Voluntary Disclosure Scheme)2019 తేది. 22.11.2019 నుంచి ప్రారంభమయ్యింది. 2019 నవంబర్ 22 నుండి ఫిబ్రవరి 21, 2020 వరకు అంటే రేపటి నుంచి వచ్చే 90 రోజులు విడిఎస్ -2019 అమలులో ఉంటుంది. గతంలో అక్రమ నల్లా కనెక్షన్ క్రమబద్ధీకరించుకోవడానికి మూడు సంవత్సరాల మంచినీటి బిల్లుతో పాటు రెట్టింపు కనెక్షన్ చార్జీలు పెనాల్టీగా కట్టాల్సివచ్చేది. విడిఎస్-2019 ప్రకారం,ఎలాంటి పెనాల్టీ లేకుండా ఒక్క కనెక్షన్ ఛార్జీ అలాగే ఒక నెలకు వచ్చే బిల్లు చెల్లించి అక్రమ నీటి కనెక్షన్లను క్రమబద్ధీకరించుకోవచ్చును. ఈ విధంగా అక్రమనల్లా కనెక్షన్లను క్రమబద్దీకరించుకోవడం వల్ల వినియోగదారులకు అధికారికంగా జలమండలి సేవలు అందించబడతాయి. అలాగే జలమండలికి సైతం వచ్చే ఆదాయం పెరిగి మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపట్టవచ్చు. ఈ పథకంలో భాగంగా ఇప్పటీవరకు 2500 దరఖాస్తులు వచ్చాయి. అధికారులు వీటిని పరిశీలించి నూతనంగా క్యాన్ నెంబర్లు కేటాయిస్తారు.
సనత్ నగర్ మోడల్ ప్రాజెక్టు
సనత్ నగర్ నియోజక వర్గంలో నీటి వృథాను తగ్గించేందుకు మోడల్ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగాఇంటింటి సర్వే, ఎమ్మార్ మీటర్ల తనిఖీలు, క్యాన్ నెంబర్లకు భవన ఫోటోల అనుసంధానం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ ప్రక్రియ సనత్ నగర్ లో విజయవంతమయితే రానున్న రోజుల్లో ఓఆర్ఆర్ వరకు నగరమంతా భవన ఫోటోల అనుసంధానం ప్రక్రియ కొనసాగుతుంది.
సెవరెజీ మాస్టర్ ప్లాన్
నగరంలో ఉన్న సెవరెజీ సామర్ధ్యం 1710 ఎమ్ఎల్డీలు, అయితే ఇప్పుడు ఉన్న ఎస్టీపీల పాయంతో 940 ఎమ్ఎల్డీలు మాత్రమే శుధ్ది చేయబడుతుంది. కాబట్టి రానున్న భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని ఓఆర్ఆర్ వరకు సమగ్రమైనా సెవరెజీ మాస్టర్ ప్లాన్ డీపీఆర్ రూపొందించే ప్రక్రియను ముంబైకి చెందిన మెస్సర్ షా కంపెనీకి అప్పగించింది.
ఓఆర్ఆర్ లోపల సెప్టిక్ ట్యాంకుల నిర్వహణకు నూతన వ్యవస్థ
ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామాల్లో దాదాపు 12 లక్షల ఇళ్లు, భవనాల సెప్టిక్ వ్యర్ధాల సేకరణ, శుద్దీకరణకు జలమండలి ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు కసరత్తు చేస్తుందని జలమండలి ఎండీ ఎం.దానకిషోర్, ఐఏఎస్ గారు తెలిపారు. ఇందుకోసం దేశంలో ఎక్కడలేని విధంగా ఫీకాల్ స్లడ్జ్ అండ్ సెప్టెజ్ మేనేజ్ మెంట్ (ఎఫ్ఎస్ఎస్ఎం) అనే నూతన వ్యవస్థ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. ఇందులో భాగంగా తేది. 23.11.2019, శనివారం రోజున ఖైరతాబాద్ జలమండలి ప్రధాన కార్యాలయంలో ఆస్కీ (అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా) ప్రతినిధులు జలమండలి ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.
ఇందుకోసం సెప్టిక్ ట్యాంకుల నిర్వహణ కొరకు ఫీకాల్ స్లడ్జ్ అండ్ సెప్టెజ్ మేనేజ్ మెంట్ అనే నూతన వ్యవస్ధను అందుబాటులోకి తీసుకువస్తామని వివరించారు. ఈ నూతన వ్యవస్థను రాబోయే రోజుల్లో చేపట్టే సెవరేజీ మాస్టర్ ప్లాన్ కు అనుసంధానం చేస్తామని స్పష్టం చేశారు.
మొత్తానికి జలమండలి 2019 సంవత్సరం ఏటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ... జాతీయ స్ధాయిలో ఇతర మెట్రో నగరాలకు ఆదర్శంగా నిలుస్తూ... కోటికిపైగా జనాభాకు సురక్షితమైన మంచినీటిని సుదూర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి సరఫరా చేస్తూ.. ఎన్నో మన్ననలు పొందుతుంది.
సేవలు

English A+ AA- A A
24గం. వినియోగదారుల సేవా కేంద్రం: 155 313
040- 23300114 & 23433933
customer-support@hyderabadwater.gov.in